పాట్నా: రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) నిరాహార దీక్ష చేస్తున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఈ దీక్ష చేపట్టారు. జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్లో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో అభ్యర్థుల నిరసనకు ఈ మేరకు మద్దతు తెలిపారు.
కాగా, ప్రశాంత్ కిషోర్కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేసి ఉంది. కోట్ల విలువైన ఈ వాహనంలో ఇంటికి సంబంధించిన కిచెన్, బెడ్ రూమ్, ఏసీతో సహా అన్ని సౌకర్యాలున్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్కు చెందిన లగ్జరీ వాహనం నిరసన ప్రాంతం వద్ద ఉండటంపై అనుమానాలతోపాటు విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు జన్ సూరజ్ పార్టీ అధికార ప్రతినిధి వివేక్ ఈ వివాదంపై స్పందించారు. ‘ఇది సమస్య కాదు. అభ్యర్థుల భవిష్యత్తు సమస్య. నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పరువు తీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు వ్యానిటీ వ్యాన్ను ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులకు న్యాయం కోసం వారి డిమాండ్లపై దృష్టి సారించాలి’ అని అన్నారు.