జైపూర్: పోటీ పరీక్షా పేపర్ లీక్ అయ్యింది. దీంతో శనివారం జరుగాల్సిన టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షను రద్దు చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ సంఘటన జరిగింది. సీనియర్ టీచర్ (సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్) కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022 కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 21, 24, 26, 27 తేదీల్లో సంబంధిత సబ్జక్టుల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
కాగా, శనివారం జరుగనున్న జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసేందుకు జలోర్ నుంచి సుమారు 50 మంది అభ్యర్థులు బస్సులో శుక్రవారం అర్థరాత్రి ఉదయ్పూర్కు వెళ్తున్నారు. అయితే హైటెక్ పద్ధతుల్లో పోటీ పరీక్షల్లో మోసం చేసే ముఠా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ బస్సును నిలువరించి సోదా చేశారు. పూర్తి చేసిన జవాబు పత్రాలు ఆ బస్సులో కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. చీటింగ్ గ్యాంగ్ లీడర్, అతడి అనుచరులు, ఇతర అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. బయాలజీ పేపర్కు సహకరించేందుకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఆ బస్సులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన సూత్రధారి జోధ్పూర్కు చెందిన వాడని, నిందితుల్లో ఎక్కువ మంది సిరోహి, జలోర్ జిల్లాల వాసులని వెల్లడించారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో శనివారం ఉదయం జరుగాల్సిన ‘గ్రూప్ -సి జనరల్ నాలెడ్జ్’ పరీక్షను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) ప్రకటించింది. మిగిలిన పరీక్షల షెడ్యూల్ యథావిధిగా జరుగుతుందని తెలిపింది. వాయిదా పడిన పరీక్ష కొత్త తేదీని త్వరలో తెలియజేస్తామని వెల్లడించింది.