Mumbai : దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవడంతో ఇప్పటికే వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు మహానగరం ముంబైలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబైలో గాలి నాణ్యత 300 పాయింట్ల తీవ్ర స్థాయికి తగ్గిపోయింది. గాలి కాలుష్యం అనేది ముంబైలో ఢిల్లీ కంటే తీవ్రమైన పరిస్థితిలో ఉంది. గురువారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315 పాయింట్లు నమోదు అయింది. దాంతో, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్క్లు ధరించాలని డాక్టర్లు కోరారు. ‘ముఖ్యంగా ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి. అంతేకాదు ఆస్తమాతో బాధపడే పిల్లలు మాస్క్లను తరచూ మార్చుకోవాలి. ఆరుబయట ఆడుకునేటప్పుడు ఇన్హేలర్ అందుబాటులో పెట్టుకోవాలి’ అని హిందూజా ఆస్పత్రిలో పనిచేస్తున్న పల్మొనాలజిస్ట్ లాన్సేలాట్ పింటో తెలిపాడు.
గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోవడంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇది చలికాలం కావడంతో చాలామంది శ్వాససంబంధ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు జలుబు, దగ్గు నుంచి కోలుకునేందుకు కొందరికి రెండు వారాలపైనే పడుతోంది. దాంతో ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఎన్ 95, కే 95 మాస్కులు ధరించాలని, గాలి నాణ్యత తక్కువ ఉన్నప్పుడు బయటకు రావొద్దని డాక్టర్లు సూచించారు.