అయోధ్య రామాలయంలో కొత్త విగ్రహం ఏర్పాటుపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ఇప్పటికే రామ్లల్లా వరిజ్మాన్ ఉండగా, కొత్త విగ్రహాన్ని ఎలా ప్రాణప్రతిష్ఠ చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఆయన లేఖ రాశారు. అయితే ఉత్సవ, మూల విరాట్టు విగ్రహాలు రెండూ ఉండొచ్చని ఆలయ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. మరోవైపు బాల రాముడి విగ్రహం ఫొటోలు లీక్ కావడంపై ఆలయ ప్రధాన పూజారి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ట్రస్ట్ అంతర్గత విచారణ చేపట్టింది.
Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ, జనవరి 20: అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహ ఏర్పాటుపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ ఇప్పటికే రామ్లల్లా వరిజ్మాన్ ఉండగా, కొత్త విగ్రహాన్ని ఎలా ప్రాణప్రతిష్ఠ చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఆయన లేఖ రాశారు. 1949లో జరిపిన తవ్వకాల్లో అయోధ్య పాత రామలయం ప్రాంతంలో రామ్లల్లా వరిజ్మాన్ (బాలరాముడు) విగ్రహం బయటపడింది. ఆ విగ్రహమే ఇప్పటివరకు పూజలందుకొంటూ వస్తున్నది. కొత్త ఆలయంలో ఆ విగ్రహాన్ని కాకుండా కొత్త విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అలా చేస్తే మరి పాత విగ్రహాన్ని ఏం చేస్తారని తన లేఖలో శంకరాచార్య ప్రశ్నించారు. గర్భ గుడిలో ఇలా కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేయటం శతాబ్దాల నాటి విగ్రహాన్ని అవమానించటమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఏడాది క్రితమే ఆలయంలో కొత్త విగ్రహం పెడుతున్నట్టు ట్రస్టు ప్రకటించిన సమయంలో చాలామంది ఇదే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నాడు ట్రస్టు సమాధానం కూడా ఇచ్చింది. ‘విగ్రహాలు రెండు రకాలు.. ఒకటి ఉత్సవ విగ్రహం.. రెండోది మూల విరాట్టు. మూల విరాట్టును ఎక్కడికీ ఎప్పటికీ కదిలించకూడదు. ఉత్సవ విగ్రహాన్ని శోభాయాత్రల సమయంలో బయటకు తీసుకొస్తారు. రామ్లల్లా చాలా చిన్నగా ఉంటుంది. అందుకే భక్తులకు 19 అడుగుల దూరం నుంచి కూడా కనిపించేలా గర్భగుడిలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాం. రామ్లల్లాను కూడా గర్భగుడిలోనే ఒక పీఠంపై ఉంచుతాం’ అని 2023, ఏప్రిల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, విశ్వహిందూ పరిషత్ నేత కామేశ్వర్ చౌపాల్ వివరణ ఇచ్చారు.
ప్రతిష్ఠాపనకు ముందే కండ్లకు ఆచ్ఛాదన లేకుండా ఉన్న బాలరాముడి విగ్రహం ఫొటోలు లీక్ కావడంపై దుమారం రేగుతున్నది. దీనిపై శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార సత్యేంద్ర దాస్ శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రామ్లల్లా పూర్తి ఫొటో బయటకు రావడంపై విచారణ చేయాలని, ఇది ఎవరు చేశారో తేల్చాలని అన్నారు. ప్రస్తుతం గర్భగుడిలోకి చేర్చిన బాలరాముడి విగ్రహం వస్ర్తాలతో కప్పి ఉంచామని, ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్ర్తాన్ని తొలగిస్తామని తెలిపారు. అయితే అంతకుముందే కండ్లకు ఆచ్ఛాదన లేకుండా ఫొటోలు బయటకు రావడం సరికాదని, ప్రాణప్రతిష్ఠకు ముందు కండ్లు కనిపించకూడదని పేర్కొన్నారు. బాలరాముడి పూర్తి రూపం కనిపించే ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలుస్తున్నది. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనుల్లో భాగంగా ఉన్న అధికారులు ఈ ఫొటోను లీక్ చేసి ఉంటారని ట్రస్ట్ అనుమానిస్తున్నది.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి వివిధ వర్గాల ప్రజలు, ఆలయాలు, సంస్థలు శ్రీరాముడికి, ఆలయానికి విలువైన, అపురూపమైన కానుకలు సమర్పించారు. కశ్మీరు ముస్లిం సోదరులు సేంద్రియ పద్ధతిలో పండించిన రెండు కిలోల కుంకుమ పువ్వును పంపించారు. తమిళనాడులోని పట్టు వస్ర్తాల తయారీదారులు పట్టు దుప్పటిపై రామాలయాన్ని చిత్రీకరించి పంపించారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లో ప్రవహించే కుభా నదీ జలాలను అక్కడివారు పంపించారు. కనౌజ్ నుంచి అనేక రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కేజీల కుంకుమ, ఢిల్లీలోని రామాలయాల నుంచి సేకరించిన ధాన్యం రామాలయానికి చేరుకున్నాయి. అదేవిధంగా 108 అడుగుల పొడవైన అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కేజీల దీపం, బంగారు పాదుకలు, 10 అడుగుల తాళం, ఏక కాలంలో 8 దేశాల సమయాన్ని తెలిపే గడియారం కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు చేరుకున్నాయి. సీతమ్మ జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్ ధామ్ నుంచి 3 వేలకు పైగా బహుమతులు వచ్చాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, వస్ర్తాలు ఉన్నాయి. శ్రీలంకలోని అశోక వాటిక ప్రత్యేక కానుకను సమర్పించింది. నాగ్పూర్ చెఫ్ విష్ణు మనోహర్ అయోధ్యలో 7,000 కేజీల రామ్ హల్వా తయారు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి (64) బంగారు పూత పూసిన పాదరక్షలు సమర్పించారు.