పుదుచ్చేరి: పిల్లల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో స్కూళ్లను మూసివేశారు. ఈ నెల 25 వరకు సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలో ఇటీవల పిల్లలు పెద్ద సంఖ్యలో జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో నమోదయ్యే 50 శాతం ఇన్ఫ్లుఎంజా కేసులు పిల్లలవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, విద్యాశాఖ మంత్రి ఏ నమశ్శివాయం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 వరకు 1-8 తరగతుల విద్యార్థులకు క్లాసులు రద్దు చేసి సెలవు ప్రకటించారు. పుదుచ్చేరి పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది.
మరోవైపు పిల్లల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతుండటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా జ్వరం వార్డులు ఏర్పాటు చేసింది. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మాస్కుల వాటకం తగ్గడంతో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న రోగులు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించింది.