పనాజీ, మార్చి 8: 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో హంగ్ ఏర్పడవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) కింగ్మేకర్గా నిలువనున్నదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఆ పార్టీని, స్వతంత్రులను ఆకర్షించే పనిలో పడ్డాయి. కచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటామని రెండు పార్టీలు నేతలు పైకి చెబుతునప్పటికీ, ఇదే సమయంలో మెజార్టీ అంకె 21 స్థానాలకు తగ్గితే.. ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధావలికర్ మద్దతు తీసుకుంటామని పేర్కొంటున్నారు. ఎంజీపీతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే టచ్లో ఉన్నదని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొనగా, కాంగ్రెస్-జీఎఫ్పీ కూటమికి మెజార్టీ రానిపక్షంలో ఎంజీపీ, ఆప్, టీఎంసీ మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దినేశ్ రావ్ అన్నారు.
పొత్తులపై జరుగుతున్న ఊహాగానాలపై ఎంజీపీ నేత, అధ్యక్షుడు దీపక్ సోదరుడు సుదిన్ స్పందించారు. తమ మద్దతు ఎవరికి అనేది ఇప్పుడే చెప్పబోమని, ఫలితాలు వెల్లడి తర్వాత.. కూటమి పక్షం టీఎంసీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 2017 ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా బీజేపీ తన రాజకీయ గిమ్మిక్కులతో అధికారాన్ని చేపట్టింది. ఎంజీపీ ఈ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీతో జట్టుకట్టింది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈసారి ముందుగానే అప్రమత్తమైంది. ఎన్నికల్లో పోటీచేసిన తమ అభ్యర్థులను రిసార్ట్కు తరలిస్తామని కాంగ్రెస్ సీనియర్ ఒకరు మంగళవారం పేర్కొన్నారు. వారు బుధవారమంతా ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్లో ఉండి గురువారం కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఫలితాల తర్వాత గెలిచిన వారు పార్టీ ఆఫీస్కు రావాలని కాంగ్రెస్ ఇప్పటికే ఆదేశించింది. సీఎం సావంత్ ఢిల్లీలో మోదీ, అమిత్షాతో భేటీ అయ్యారు.