ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్కు (Ajit Pawar) ఆయన వర్గం నేతలు షాక్ ఇచ్చారు. నలుగురు పార్టీ నేతలు రాజీనామా చేశారు. శరద్ పవార్ వర్గంలో వారు చేరనున్నట్లు తెలుస్తున్నది. ఎన్సీపీకి చెందిన పింప్రీ-చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనే, విద్యార్థి విభాగం అధ్యక్షుడు యశ్ సానే, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ తమ రాజీనామాలను అజిత్ పవార్కు సమర్పించారు. భోసారి అసెంబ్లీ స్థానానికి టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అజిత్ గవాహనే రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ లాంగే గత రెండు దఫాలుగా భోసారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తారని తెలుస్తున్నది.
కాగా, అజిత్ పవార్ వర్గానికి చెందిన కొందరు నేతలు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న పింప్రి-చించ్వాడ్కు చెందిన నలుగురు నేతలు రాజీనామా చేయడం అజిత్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో వీరు చేరుతారని సమాచారం.
మరోవైపు మహారాష్ట్ర మంత్రి, సీనియర్ ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్ కూడా అజిత్ పవార్ను విడిచిపెట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల శరద్ పవార్ను ఆయన ఇంట్లో కలిశారు. మహా వికాస్ అఘాడిలో భాగమైన శివసేన (యూబీటీ) నేతతో కూడా గత నెలలో ఆయన సమావేశమయ్యారు.