న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు దగ్గరపడినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) యాక్టీవ్ అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ.. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేజ్రివాల్ తాజా వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ సింగ్ నివాసంలో నిర్వహిస్తున్న సోదాల్లో ఈడీకి ఏమీ దొరకవని కేజ్రివాల్ పేర్కొన్నారు. కొన్ని నెలల్లో 2024 లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయని, ఆ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయం బీజేపీకి అర్థమైందని, అందుకే ఓటమిని తప్పించుకునేందుకు బీజేపీ సర్కారు విపక్షాలపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి అవినీతిపరులుగా ముద్ర వేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా విపక్ష నేతలపై విచారణ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ యాక్టీవ్ అవుతాయని కేజ్రివాల్ ఎద్దేవా చేశారు. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆధారాలు లభిస్తే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరెస్టయ్యి జైల్లో ఉన్నారు.