Delhi Municipal Elections : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు మూడపడనున్నాయి. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 250 వార్డలకు డిసెంబర్ 4వ తేదీన ఎలక్షన్ జరగనుంది. డిసెంబర్ 7వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాంతో, ఆరోజు కూడా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఢిల్లీ అబ్కారీ శాఖ రూల్ నంబర్ 52 ప్రకారం డిసెంబర్ 2, 3, 4వ తేదీతో పాటు ఓట్ల లెక్కింపు జరగనున్న 7వ తేదీన మద్యం షాపులు మూతపడనున్నాయి అని ఢిల్లీ అబ్కారీ శాఖ కమిషనర్ కృష్ణ మోహన్ ఉప్పు ఒక ప్రకటనలో తెలిపాడు.
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ దాంతో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పోరేషన్లను విలీనం చేసింది. ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్కటి చేసింది. ఈ మూడింటి విలీనం తర్వాత మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.