న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల నమోదును పర్యవేక్షించడంతోపాటు వాటి గురించి రిపోర్ట్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం జాతీయ ల్యాబ్లకు పంపాలని తెలిపింది. తద్వారా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుందని కేంద్రం పేర్కొంది.
మరోవైపు రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. పరిశుభ్రత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని నివారించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు, అవగాహన కార్యక్రమాలు వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది.