తిరువనంతపురం: రెండు డిపార్ట్మెంట్ల మధ్య పోరు ( power play) జరుగుతున్నది. తమ వాహనాలకు ట్రాఫిక్ చలాన్లు విధించడంపై విద్యుత్ బోర్డు ప్రతీకారం తీర్చుకుంటున్నది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ (ఎంవీడీ)కు చెందిన రోడ్డు రవాణా కార్యాలయాలకు (ఆర్టీవో) విద్యుత్ సరఫరా కట్ చేస్తున్నది. కేరళలో గత కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతున్నది. వాయనాడ్లో ఇటీవల కొత్తగా ఏఐ ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూన్ 17న చెట్లను కత్తిరించే పరికరాన్ని తీసుకెళ్తున్న విద్యుత్ బోర్డుకు చెందిన కాంట్రాక్ వాహనానికి రూ.20,000 జరిమానా విధిస్తూ చలాన్ జారీ చేశారు.
కాగా, ఈ చలానాపై విద్యుత్ బోర్డు మండిపడింది. వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. వాయనాడ్లోని కల్పత్తా ఎన్ఫోర్స్మెంట్ రోడ్డు రవాణా కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. మే 24 నుంచి రూ.11,000 విద్యుత్ బిల్లు బకాయి ఉన్నట్లు పేర్కొంది. అయితే వాయనాడ్ జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు మోటారు వాహన శాఖ ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలను ఈ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రభావం పడటంతో మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది. అత్యవసర నిధి నుంచి విద్యుత్ బిల్లు బకాయిలను చెల్లించింది. దీంతో ఆ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
మరోవైపు కేరళలోని కన్నూరు, కాసర్గోడ్ జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కన్నూర్ జిల్లాలోని మట్టన్నూర్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆర్టీవోకు రూ.52 వేల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. దీంతో ఆ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఏఐ కెమెరాల ఆపరేషన్పై ఈ ప్రభావం పడింది. ప్రతిగా విద్యుత్ శాఖ వాహనాలకు చలాన్లు విధించారు. అలాగే రూ.23,000 బకాయి బిల్లుకు సంబంధించి జూన్ 30న కాసర్గోడ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్టీవోకు విద్యుత్ సరఫరాను విద్యుత్ బోర్డు డిస్కనెక్ట్ చేసింది.
కాగా, ఈ వివాదంపై రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు స్పందించారు. విద్యుత్ బోర్డు వాహనాలకు చలాన్లు విధిస్తున్న తన శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఏఐ కెమెరాల పర్యవేక్షణ నుంచి మినహాయింపు ఉన్న సంగతిని గుర్తు చేశారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని కిందిస్థాయి సిబ్బంది వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని అన్నారు.
మరోవైపు మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్, విద్యుత్ బోర్డు మధ్య జరుగున్న ఈ పోరుకు అసలు కారణం వేరే అని తెలుస్తున్నది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే విద్యుత్ శాఖ అధికారులు సాధారణ హెల్మెట్లకు బదులు భద్రతా హెల్మెట్లు ధరిస్తున్నారు. దీంతో ఏఐ కెమెరాల ద్వారా దీనిని గుర్తించి జరిమానా విధించి వారికి చలాన్లు జారీ చేస్తున్నారు. దీనికి ప్రతీకారంగా విద్యుత్ బిల్లు బకాయిలున్న ఆర్టీవో కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను ఆ శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు.