న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ జనవరి 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల టూర్లో భాగంగా కేజ్రీవాల్ జలంధర్, అమృత్సర్ సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
జనవరి 27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనకు రానున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించిన నేపధ్యంలో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ టూర్ షెడ్యూల్ను ఆ పార్టీ వెల్లడించింది. రాహుల్ గాంధీ అమృత్సర్, జలంధర్, మిథాపూర్లో పర్యటిస్తారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్ధుబాటును ఖరారు చేసింది.
కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్కాంగ్రెస్ 37 స్ధానాల్లో పోటీ చేయనుండగా, ఎంపీ సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) 15 స్ధానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ 65 స్ధానాల్లో తన అభ్యర్ధులను బరిలో దింపనుంది. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.