Arvind Kejriwal : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు. అందుకే పంజాబ్ ప్రజలకు తన మొహం చూపించడానికి రాహుల్ ఇష్టపడటం లేదని, ఈ కారణంగానే ఆయన పంజాబ్ పర్యటనకు చాలా ఆలస్యంగా వెళ్లారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. అటు కాంగ్రెస్ పాలనతో, ఇటు అకాలీదళ్ పాలనతో కాంగ్రెస్ ప్రజలు విసిగిపోయారని, అసలు వారికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.
రెండు పార్టీలూ ప్రజలకు న్యాయం చేయలేకపోయాయని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులు మాత్రం నిత్యం ప్రజలకు టచ్లోనే వుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను సత్యమార్గంలో నడుస్తున్నానని, అందుకే తనను తిడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, అకాలీదళ్ కలిసి తనను తిడుతున్నారు కానీ, వారిద్దరూ విమర్శలు చేసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, అకాలీదళ్ ప్రభుత్వాలు పంజాబ్ ప్రజలను దోచుకున్నాయని కేజ్రీవాల్ మండిపడ్డారు.
పంజాబ్ ఎన్నికల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం పంజాబ్లో పర్యటించారు. రోజంతా జలంధర్లో పర్యటించారు. పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఒక పార్టీకి ఇద్దరు నాయకులు సారథ్యం వహించలేరని, ఒక్కరే నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా సీఎం పీఠం విషయంపై సీఎం చెన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మధ్య పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు.