న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు నిరక్షరాస్యులే ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బడ్జెట్లో అడ్వైర్టెజ్మెంట్లకు రూ.500 కోట్లు కేటాయిస్తే.. మౌలిక వసతుల కల్పనకు రూ.20,000 కోట్లు కేటాయించామని, ఈ రెండింటిలో ఏదీ ఎక్కువో కూడా వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్న వారికి కనీసం బడ్జెట్ కూడా అర్థం కావడం లేదన్నారు.
మంగళవారం ప్రవేశపెట్టాల్సిన ఢిల్లీ బడ్జెట్కు ఆమోదం తెలపడంలో కేంద్ర హోంశాఖ జాప్యంపై ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూలు ప్రకారం ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, బడ్జెట్లో కేటాయింపులపై ప్రశ్నలు లేవనెత్తిన కేంద్ర హోంశాఖ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. అడ్వైర్టెజ్మెంట్లకు ఎక్కువగా నిధులు కేటాయించారని, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు తక్కువ కేటాయించారని ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. ఒక రాష్ట్ర బడ్జెట్ను అడ్డుకోవడం 75 ఏండ్ల చరిత్రలో ఇదే మొదటిసారని ఆరోపించారు. ఢిల్లీవాసులపైన మీకెందుకు ఇంత కోపం అని ప్రశ్నించారు.
అదే బడ్జెట్కు ఆమోదం
బడ్జెట్ కేటాయింపులపై కేంద్రం, ఎల్జీ లేవనెత్తిన అంశాలకు ఢిల్లీ ఆర్థిక శాఖ జవాబులిచ్చింది. బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయినా మంగళవారం బడ్జెట్కు ఆమోదం లభించింది. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేజ్రీవాల్… మొదట ఆమోదించని బడ్జెట్కే కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలిపిందని, తద్వారా ఢిల్లీ ప్రభుత్వం తలవంచాలనే కేంద్రం అహం సంతృప్తి చెందిందని పేర్కొన్నారు.