న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశారు. 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు.
ఆప్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రలోభాల నేపధ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో కూడా బీజేపీ విఫలమైందని అన్నారు. తమకు 62 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, ఇద్దరు విదేశాల్లో ఉన్నారని, ఓ సభ్యుడు జైల్లో ఉండగా, మరో సభ్యుడు శాసనసభ స్పీకర్ అని పేర్కొన్నారు.