Kejriwal in Punjab | వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారం ముమ్మరం చేసింది. ప్రజలను ఆకట్టుకోవడానికి పలు హామీలు ఇస్తున్నది. రెండు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్కు వచ్చిన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మొగాలో పర్యటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు రూ.1000 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.
ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారికి ఈ మొత్తం అదనంగా చెల్లిస్తామని తెలిపారు. మిషన్ పంజాబ్ అనే పేరుతో పంజాబ్లోని పలు ప్రాంతాల్లో కేజ్రీవాల్ పర్యటిస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి అధికారం చేపట్టే దిశగా అడుగులేస్తున్నది. తమ పార్టీని గెలిపిస్తే ప్రతి ఇంటికి ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ నిరంతరాయంగా పంపిణీ చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో మందులు పంపిణీ చేస్తామని కూడా వాగ్దానం చేశారు.