న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నవరాత్రి ప్రసాదంగా ఒక్కసారి మాత్రమే ఆలూ పూరీ తిన్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు. అలాగే జైలులో కేవలం మూడుసార్లు మాత్రమే మామిడి పండ్లు తిన్నారని చెప్పారు. బెయిల్ పొందడం కోసం కేజ్రీవాల్ తన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా ఆలూ పూరీ, మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారన్న ఈడీ ఆరోపణలను అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు.
కాగా, డయాబెటిక్ పేషెంట్ అయిన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనపై రోస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. ఆయన తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా కేవలం మూడుసార్లు మాత్రమే కేజ్రీవాల్ మామిడిపండ్లు తిన్నారని కోర్టుకు తెలిపారు. గ్లైసెమిక్ ఇండెక్స్ 51గా ఉన్న మామిడిలో, 73 ఇండెక్స్ ఉన్న వైట్ రైస్, 68 ఇండెక్స్ ఉన్న బ్రౌన్ రైస్ కంటే తక్కువ షుగర్ ఉంటుందని వివరించారు. అందుకే దానిని ఆహారంగా కూడా అనుమతించారని అన్నారు.
మరోవైపు కేజ్రీవాల్ జైలులో ఎక్కువగా స్వీట్లు తింటున్నారన్న ఈడీ ఆరోపణలను కూడా అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు. షుగర్ లేని స్వీట్లను ఆరుసార్లు తిన్నారని కోర్టుకు తెలిపారు. అలాగే కేజ్రీవాల్ షుగర్ లేకుండా టీ తాగుతున్నారని కేవలం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుతున్నారని చెప్పారు. 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్తో మాట్లాడేందుకు అనుమతించకపోవడానికి కేజ్రీవాల్ క్రిమినల్ లేదా గ్యాంగ్స్టరా? అని సింఘ్వీ ప్రశ్నించారు.