న్యూఢిల్లీ : పోటెత్తిన వరదతో దేశ రాజధాని (Delhi Floods) నీట మునిగి సామాన్యుడు సతమతమవుతుంటే వరదలపై బురద రాజకీయానికి బీజేపీ, ఆప్లు తెరలేపాయి. యమునా నది వరదకు మీరంటే మీరే కారణమని ఇరు పార్టీలూ బ్లేమ్ గేమ్కు తెగబడ్డాయి. కాషాయ పార్టీ తీరుతోనే ఢిల్లీని వరద ముంచెత్తిందని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించగా ప్రకృతికి భౌగోళిక హద్దులంటూ ఉండవని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చురకలంటించారు.
ఏటా భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ సహా చైనా నుంచి కూడా అసోం వరద ముప్పు పొంచిఉన్నా తాము వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. తాము ఊహకందని కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నా ఇతరులను అందుకు నిందించమని అన్నారు. ప్రకృతి భౌగోళిక సరిహద్దులను గుర్తించదని తమకు తెలిసినందునే తాము పరిణితితో వ్యవహరిస్తామని కేజ్రీవాల్కు పరోక్షంగా చురకలు వేశారు. ఢిల్లీ వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, బీజేపీ పధకం ప్రకారం సృష్టించిన సంక్షోభ ఫలితమని ఆప్ శనివారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆప్ వ్యాఖ్యలపై గౌతం గంభీర్, మీనాక్షి లేఖి, వీరేంద్ర సచ్దేవ వంటి బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక ఢిల్లీని నీట ముంచేందుకు హర్యానాలోని హథ్ని కుండ్ బ్యారేజ్ నుంచి ఉద్దేశపూర్వకంగా నీటిని యమునా నదిలోకి విడుదల చేశారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఢిల్లీలోని ఐటీఓ బ్యారేజ్ గేట్ల నిర్వహణ బాధ్యతలు హర్యానా చేతిలో ఉండటం వల్ల కూడా నిర్వహణపరమైన సమస్యలు తలెత్తాయని ఆప్ పేర్కొంది. ఈ బ్యారేజ్ నిర్వహణను ఢిల్లీకి అప్పగిస్తే సమర్ధంగా నిర్వహించడం సాధ్యమవుతుందని ఆప్ డిమాండ్ చేసింది.
Read More :