తిరువనంతపురం: ఢిల్లీలో అధికారం తర్వాత పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటుతో ఫుల్ జోష్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దక్షిణాదిలో అడుగు పెట్టడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా కేరళలోని ట్వంటీ20 పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కొచ్చీని సందర్శించారు. కేరళకు చెందిన ట్వంటీ20 పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ను ప్రకటించారు. ఇప్పుడు కేరళలో నాలుగు రాజకీయ కూటములు ఉన్నాయన్నారు. ఎల్డీఎఫ్, యూడిఎఫ్, ఎన్డీయేతోపాటు తమ కూటమి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ కూడా అని చెప్పారు. ‘మీకు రాజకీయాలు, అల్లర్లు, అవినీతి కావాలంటే ఇతర రాజకీయ పార్టీల వద్దకు వెళ్లవచ్చు. మీకు అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే మీరు మా వద్దకు రావాలి’ అని అన్నారు. అల్లర్లు, గూండాయిజం చేసే ఇతర పార్టీలు మీ పిల్లలకు ఎప్పుడూ కూడా సరైన విద్య అందించలేవని విమర్శించారు.
తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో 24 గంటలపాటు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీంతో ఢిల్లీలో ఇన్వర్టర్, జనరేటర్ దుకాణాలు మూతపడ్డాయని చెప్పారు. కేరళ ప్రజలకు కూడా ఉచిత విద్యుత్ అక్కర్లేదా? అని ప్రశ్నించారు. కేరళలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీ మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు.