న్యూఢిల్లీ, జనవరి 3: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. తాజాగా మూడోసారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై దర్యాప్తు సంస్థ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈడీ మౌనం చూస్తుంటే ఏదో అవాంఛనీయ రహస్యాన్ని దాయడమే కాక, అపారదర్శకంగా, పక్షపాతంతో ఉన్నట్టు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు.