(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): చదువుల నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. మానవ ప్రమేయాన్ని తగ్గించి క్లిష్టమైన పనులను సులువుగా, వేగంగా నిర్వర్తించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే ఏఐ. అయితే, ఏఐ కారణంగా పర్యావరణానికి ఒకవిధంగా పెద్దయెత్తున నష్టం వాటిల్లుతున్నట్టు వాతావరణ నిపుణులు అంటున్నారు. సకల జీవరాశికి అవసరమైన నీటిని ఏఐ సాంకేతికత అమాంతం మింగేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి వాడకం పెద్దయెత్తున అవసరం లేకుండానే డాటా సెంటర్లను పనిచేయించే అత్యాధునిక సాంకేతికతను అమెరికాకు చెందిన ఎన్వీడియా కంపెనీ తాజాగా అభివృద్ధి చేసింది.
ఇప్పటివరకూ నీటి వాడకం ఇలా..
ఏదైనా అంశం గురించి వెదకాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి సెర్చ్ చేస్తాం. మనం కీబోర్డ్తో టైప్ చేయగానే సదరు ఐటెమ్కు సంబంధించిన లక్షలాది లింకులు ప్రత్యక్షమవుతాయి. బ్యాగ్రౌండ్లో ఈ వర్క్ను ఏఐ నిర్వహిస్తుంది. చాట్జీపీటీ, క్లాడ్, గూగుల్ జెమినీ, గ్రోక్, డీప్సీక్ వంటి చాట్బాట్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇలాగే వస్తాయి. అయితే, ఒక్క సమాధానం రావడానికి డాటాసెంటర్లలోని పలు సర్వర్లు అనుసంధానమై సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పెద్దయెత్తున కరెంట్ వినియోగించాల్సి వస్తున్నది. ఇక, ఏఐ రిజల్ట్స్ కోసం నిరంతరాయంగా సర్వర్లు పనిచేయడంతో అవి విపరీతంగా వేడెక్కిపోతాయి. దీంతో వాటిని చల్లబరిచేందుకు పెద్దయెత్తున నీళ్లు అవసరమవుతున్నాయి. ఈ విధంగా ఉపయోగించిన నీటిలో చాలా వరకు ఆవిరిగా మారిపోతుంది లేదా వ్యర్థ జలంగా మారుతుంది. 2024లో గూగుల్ కంపెనీ తమ డాటా సెంటర్లలోని సర్వర్లను చల్లబరిచేందుకు 3,070 కోట్ల లీటర్ల నీటిని వాడింది. అంటే తుర్కియేలో 33 శాతం మంది జనాభాకు ఏడాదిపాటు సరిపోను నీటికి ఇది సమానం. రోజురోజుకూ ఏఐ వాడకం పెరిగిపోవడంతో, అదేస్థాయిలో కరెంట్, నీటి వినియోగం కూడా పెరిగిపోతున్నది. దీంతో ఏఐ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదమున్నదని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్వీడియా సాంకేతికతతో ఇలా..
ప్రముఖ టెక్ కంపెనీ ఎన్వీడియా జీరో-వాటర్ కూలింగ్ టెక్నాలజీ అనే వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది. డాటా సెంటర్ల సర్వర్లను చల్లబరచడానికి నిరంతరాయంగా చల్లటి నీటిని సరఫరా చేయడానికి బదులు కారు ఇంజిన్ను చల్లబర్చే రేడియేటర్ మాదిరిగా క్లోజ్డ్ లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. దీంతో ఒక్కసారి పంప్ చేసిన నీళ్లు నిరంతరాయంగా సర్వర్లను చల్లబరుస్తూనే ఉంటాయి. సర్వర్లను చల్లబర్చిన తర్వాత వేడెక్కిన నీటిని తిరిగి చల్లబర్చేందుకు ఈ సిస్టమ్లోని లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ సాయపడుతుందని పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి కష్టాలు తీరుతాయని ఎన్వీడియా చెబుతోది.
సముద్ర గర్భంలో డాటా సెంటర్
ఏఐ కోసం నీటి వినియోగాన్ని తగ్గించేందుకు చైనా తొలిసారిగా పవన విద్యుత్తుతో నడిచే డాటా సెంటర్ను షాంఘై తీరంలోని సముద్రగర్భంలో ఏర్పాటు చేసింది. ఇది తక్కువ విద్యుత్తు, తక్కువ నీటిని వినియోగిస్తుందని, నీటి కష్టాలు ఉండబోవని ఏఐ టెక్ పరిశోధకులు పేర్కొన్నారు.