భువనేశ్వర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తృతి రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే ఆటో మొబైల్, టెలీ కమ్యూనికేషన్ సహా పలు రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ AI వల్ల మ్యాన్ పవర్ అవసరం తగ్గిపోతూ యాంత్రీకరణ పెరిగిపోతున్నది. ఇప్పుడు కొత్తగా మీడియా రంగంలోకి కూడా AI వచ్చి చేరింది. ఇంతవరకు విదేశాల్లో మాత్రమే AI ద్వారా న్యూస్ చదివే యాంకర్లను చూశాం. ఇప్పుడిప్పుడే భారత్లోనూ ఈ ట్రెండ్ మొదలయ్యింది. ఈ మధ్యనే కొన్ని జాతీయ ఛానెళ్లు AI న్యూస్ యాంకర్స్ను పరిచయం చేశాయి. ఇక ఇప్పుడు ప్రాంతీయ ఛానెల్స్లోనూ AI న్యూస్ యాంకర్ కాలుమోపింది. మరి అదెక్కడో తెలుసుకుందామా..?
ప్రాంతీయ ఛానెల్స్లో తొలి AI న్యూస్ యాంకర్
ప్రాంతీయ ఛానెల్స్లో AI న్యూస్ యాంకర్ ప్రత్యక్షమైంది. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని ఓ న్యూస్ ఛానెల్లో తొలి AI న్యూస్ యాంకర్ వార్తలు చదివి అందరినీ ఆశ్చర్యపర్చింది. భువనేశ్వర్కు చెందిన ఒడిశా టెలివిజన్ నెట్వర్క్ (OTV) యాజమాన్యం ఈ AI న్యూస్ యాంకర్కు లిసా అని పేరు పెట్టింది. ఈ న్యూస్ యాంకర్ ఒడిశా సాంప్రదాయ చేనేత చీర ధరించి అచ్చం భారతీయ యువతిలా కనిపించింది. ఇంగ్లిష్తోపాటు ఒరియాలోనూ వార్తలు చదివి అబ్బురపర్చింది.
టీవీతోపాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ లిసా టీవీతో పాటు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్లోనూ ప్రధాన యాంకర్గా వ్యవహరిస్తుందని OTV యాజమాన్యం వెల్లడించింది. టీవీ బ్రాడ్ కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ AI యాంకర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. AI న్యూస్ ప్రజెంటర్ లిసా భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని భాషలు మాట్లాడుతుందని వెల్లడించింది. లిసా పేరుతో OTV యాజమాన్యం సోషల్ మీడియాలో అకౌంట్లు కూడా ఓపెన్ చేసింది. రానున్న రోజుల్లో AI యాంకర్ల హవా పెరుగుతుందని అభిప్రాయపడింది. ఒరియా భాషలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా పెద్ద పని అయినా తాము చేసి చూపించామని OTV డిజిటల్ బిజినెస్ హెడ్ లితీషా మంగత్ పాండా వెల్లడించారు. తాము లిసాకు ఇంకా శిక్షణ ఇస్తూనే ఉన్నామని, ఆ యాంకర్ను ఇతరులతో సులభంగా సంభాషించే స్థాయికి తీసుకువస్తామని ఆమె అన్నారు.
OTVని ప్రారంభించింది ఎవరు..?
భువనేశ్వర్కు చెందిన ఒడిశా టెలివిజన్ నెట్వర్క్ యాజమాన్యంలో OTV కొనసాగుతున్నది. జాగీ మంగత్ పాండా అనే వ్యక్తి ఈ ఛానెల్ ను ప్రారంభించారు. ఈ OTV ఒడిశా రాష్ట్రంలో తొలి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇది 1997లో జంట నగరాలైన భువనేశ్వర్, కటక్లో ప్రసారాలను ప్రారంభించింది. ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించింది. ఆ తర్వాత 2006 డిసెంబర్లో కేబుల్ టీవీ నుంచి శాటిలైట్ ఛానెల్గా మారింది.