ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ నేపథ్యంలో పదవికి ఆయన రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము నిరసన చేస్తామని హెచ్చరించారు. శివనేన నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులపై ఆరోపణల జాబితా చాలా ఉందన్నారు. ప్రజలు వీటిపై విసిగిపోతున్నారని చంద్రకాంత్ పాటిల్ విమర్శించారు.
ఎన్సీపీ సీనియర్ నేత, మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఈ ఉదయం ఆయనను ప్రశ్నించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద మాలిక్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
మరోవైపు అరెస్ట్పై తాను భయపడబోనని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తానంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. 2024 తర్వాత బీజేపీ నేతలకు కూడా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.