Lucknow | మాజీ మంత్రి, ఇటీవలే బీజేపీకి గుడ్బై చెప్పిన స్వామి ప్రసాద్ మౌర్యకు ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 24 లోగా విచారణకు హాజరు కావాలని సుల్తాన్పూర్ కోర్టు ఆదేశించింది. 2014 లో ఆయన దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయన బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసినట్లు తెలుస్తోంది. 2014 లో దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన బీఎస్పీలో ఉన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారమే బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఈ రాజీనామా తర్వాతే అరెస్ట్ వారెంట్ వెలువడటం గమనించాల్సిన పరిణామం.
వివాహాల సమయంలో గౌరీ మాతను గానీ, గణపతి ఆరాధన గానీ చేయకండి. ఇదంతా ఉన్నత వర్గాల కుట్ర. ఉన్నత వర్గాల వారు దళితులను, వెనుకబడిన వర్గాల వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అని స్వామి మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
యోగి ప్రభుత్వంలో కార్మిక ఉపాధి కల్పన మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. వీరు సమాజ్వాదీ పార్టీలో చేరిపోయారు. దీంతో బీజేపీ ఒక్కసారిగా ఖంగుతింది. మౌర్యతో ఉన్న ఫొటోను అఖిలేశ్ యాదవ్ పోస్ట్ చేశారు. యోగి ప్రభుత్వంపై దళితులు, నిరుద్యోగిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన ఆరోపించారు. సైద్ధాంతిక వైరుద్ధ్యం ఉన్నా.. ఎంతో నిబద్ధతతోనే పని చేశానని, అయినా యోగి సర్కార్ నిర్లక్ష్యం వహించిందని స్వామి ప్రసాద్ ఆరోపించారు. స్వామి ప్రసాద్ రాజీనామా చేయగానే రోషన్ లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భవతి సాగర్, వినయ్ శక్యా కూడా బీజేపీకి రాజీనామా చేశారు.