అలీపూర్దువార్, నవంబర్ 16: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిశిత్ ప్రామాణిక్కు పదమూడేండ్ల నాటి బంగారం దుకాణాల చోరీ కేసులో కోర్టు అరెస్టు వారంటు జారీ చేసింది. బెంగాల్లోని అలీపూర్దువార్ రైల్వే స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలో, బీర్పాడాలోని రెండు బంగారం దుకాణాల్లో 2009లో దొంగతనం జరిగింది. ఆ కేసులో మరోవ్యక్తితో పాటుగా ప్రామాణిక్ నిందితునిగా ఉన్నారు. అలీపూర్దువార్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు బుధవారం ఈ కేసుపై విచారణ సందర్భంగా ఆయనకు అరెస్టు వారంటు జారీ చేసింది. ప్రామాణిక్ తరఫు న్యాయవాది దులాల్ ఘోష్ తమ తదుపరి చర్య ఏమిటో వెల్లడించేందుకు నిరాకరించారు. హైకోర్టు ఆదేశం మేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి ఈ కేసును అలీపూర్దువార్ కోర్టుకు బదిలీచేశారు. ప్రామాణిక్ 2019లో బీజేపీలో చేరి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గానూ తృణమూల్ నుంచి బహిష్కరించారు.