Bureaucrats | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు, నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలకు దిగుతుండటాన్ని మాజీ బ్యూరోక్రాట్లు ఆక్షేపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వారు గురువారం లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న ప్రస్తుత సమయంలో విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం ఉద్దేశ్వపూర్వక చర్యగా తమకు తోస్తున్నదని పేర్కొన్నారు.
అవినీతిపై చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు ఉన్న అధికారాన్ని తాము ప్రశ్నించడం లేదని, నేతలను అరెస్ట్ చేసిన సమయాన్నే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఎన్నికల వేళ రాష్ర్టాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని నియంత్రణలోకి తీసుకుంటున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నియంత్రణలోకి తీసుకోవాలని ఈసీని కోరారు.
లేకపోతే ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలు చేస్తున్నప్పుడు మౌనంగా ఉంటున్నదనే అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్(సీసీజీ) తరఫున వజాహత్ హబీబుల్లా, ఏఎస్ దులత్, శివశంకర్ మీనన్, జీకే పిైళ్లె, మీరన్ సీ బోర్వాంకర్, కే సుజాతారావు, జూలియో రిబీరో, మాక్స్వెల్ పీరా, వప్పాల బాలచంద్రన్ సహా 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు ఈ లేఖపై సంతకాలు చేశారు.
చర్యలు తీసుకోకపోతే గందరగోళమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు వ్యవహరిస్తున్న తీరును మాజీ బ్యూరోక్రాట్లు ఈ లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, టీఎంసీ మహువా మొయిత్రా ఆస్తులపై సోదాలు, కాంగ్రెస్పై ఐటీ దాడులు తదితర చర్యలను పేర్కొన్నారు. ఎన్నికల ముంగిట అరెస్టులు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఫలితాలు వచ్చాక ఆ పనిచేస్తే వచ్చే నష్టమేంటని లేఖలో ప్రశ్నించారు.
ఈ విషయంలో ఈసీ తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై తామంతా ఆందోళనగా ఉన్నామని తెలిపారు. ఆర్టికల్ 324 కింద ఎన్నికల కమిషన్ తన అధికారాలను ఉపయోగించాలని, కేంద్ర అధికార యంత్రాంగాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కేంద్రంలోని చట్టాన్ని అమలు చేసే సంస్థల కార్యకలాపాలను ఈసీ నియంత్రించాలని కోరారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల్లోని చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా కేంద్ర సంస్థల్లానే వ్యవహరిస్తే అరాచకానికి దారితీయొచ్చని, ఎన్నికల ప్రక్రియనే గందగరోళంగా మారుతుందని వారు హెచ్చరించారు.