భారత్ బంద్ చేపట్టిన ఆర్మీ ఉద్యోగార్థులు
ఉత్తరాదిన 8 రాష్ర్టాల్లో బంద్ ప్రభావం
డిపోల్లోనే బస్సులు.. 600కుపైగా రైళ్లు రద్దు
24న దేశవ్యాప్త నిరసనలు: టికాయిత్
అగ్నివీరుల రిజిస్ట్రేషన్లకు ఆర్మీ నోటిఫికేషన్
తమను అభ్యర్థులు నమ్మకపోవడంతో
కార్పొరేట్లను రంగంలోకి దించిన కేంద్రం
మిమ్ములను అర్థం చేసుకోనిది ఎవరు?
బీజేపీ నాయకులా.. దేశ యువతనా?
ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న
దేశ సేవనూ కాంట్రాక్ట్ ఉద్యోగంగా మార్చేసి.. యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రాజుకున్న నిరసనాగ్ని అంతకంతకూ ఉద్ధృతమవుతున్నది. ‘అగ్నిపథ్’ స్కీమ్ను నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు సోమవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. ఉత్తరాదిలోని 8 రాష్ర్టాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పథకాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరసనపోరును ఆపబోయేదిలేదని అభ్యర్థులు నినదించారు. అగ్నిపథ్పై తమ ప్రకటనలను అభ్యర్థులు నమ్మకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలను రంగంలోకి దింపింది. సైన్యం నుంచి బయటకు వచ్చాక తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటనలు ఇప్పించింది.
భారత్ బంద్ నేపథ్యంలో రైళ్లు రద్దు కావడంతో హౌరా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు
న్యూఢిల్లీ, జూన్ 20: సాయుధ దళాల్లో తాత్కాలిక నియామకాల కోసం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు సోమవారం తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం పలు రాష్ర్టాల్లో స్పష్టంగా కనిపించింది. బంద్ నేపథ్యంలో సోమవారం 612 రైలు సర్వీసులను రద్దు చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది. బంద్ నేపథ్యంలో జమ్ములో ఆర్మీ ఉద్యోగార్థులు, కాంగ్రెస్, ఆప్ నేతృత్వంలో భారీయెత్తున నిరసనలు జరిగాయి. ఆందోళనల్లో భాగంగా రోడ్లను దిగ్బంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కీలక రోడ్లను మూసివేయడంతో ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంత పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిపథ్తో పాటు తమ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ నిరసనలను నిర్వహించింది. నగరంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హర్యానాలోని ఫతేహాబాద్, రోహతక్ తదితర ప్రాంతాల్లోని రోడ్లను నిరసనకారులు దిగ్బంధించారు. ఆందోళనకారులు దాడిచేస్తారన్న అనుమానంతో అంబాలా, రెవారీ, సోనిపేట్తో పాటు పంజాబ్లోని లుదియానా, జలంధర్, అమృత్సర్ రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్వ్యాప్తంగా పాఠశాలలు మూతబడ్డాయి. నిరసనకారుల ఆందోళనలు తీవ్రమయ్యే అవకాశమున్న నేపథ్యంలో దాదాపు 5 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. బీహార్, యూపీ, ఉత్తరాఖండ్, తమిళనాడుపై కూడా బంద్ ప్రభావం పడింది. ఆయా రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి.
వచ్చే నెల నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిజిస్ట్రేషన్లు
అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలంటూ ఒకవైపు దేశవ్యాప్తంగా బంద్లు, నిరసనలు హోరెత్తుతుంటే.. కేంద్రం మాత్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నది. ‘అగ్నిపథ్’ నియామక ప్రక్రియకు సంబంధించి సోమవారం ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను స్వీకరిస్తామని పేర్కొంది. www.joinindianarmy.nic.in లేదా www. joinindianarmy.nic ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించింది. అర్హతలు, వేతనాలు, నిబంధనలను నోటిఫికేషన్లో పొందుపరిచింది.
సొంత క్యాడర్ కోసమే..
సొంతంగా సాయుధ క్యాడర్ను నిర్మించుకోవడానికే ‘అగ్నిపథ్’ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ పథకం.. సాయుధ దళాలకు ఎంతో అవమానకరమన్నారు. నాలుగేండ్ల సర్వీస్ పూర్తయ్యా క..అగ్నివీరులను బీజేపీ నేతలు తమ పార్టీ ఆఫీసుల ముందు వాచ్మెన్లుగా నియమించుకుంటారా? అని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామన్న బీజేపీ.. ఇప్పుడు పలు స్కీమ్ల పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అగ్నిపథ్’ పథకం మాజీ త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ను అవమానించేలా ఉన్నదని కాంగ్రెస్ మండిపడింది. ఆర్మీ జవాన్లు, అధికారుల పదవీవిరమణ వయసును పెంచాలని 2020లో రావత్ చేసిన ప్రతిపాదనను ఈ మేరకు గుర్తుచేసింది.
కలిసి పోరాడుదాం
‘అగ్నిపథ్’ స్కీమ్ను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో ఈ శుక్రవారం (జూన్ 24) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. ఈ మేరకు రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ సోమవారం వెల్లడించారు. యువత, పౌర సమాజం, రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.