న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య ఈ నెల 9న జరిగిన ఘర్షణపై పార్లమెంట్ వేదికగా తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్నది. పార్లమెంట్ ఉభయసభల్లో ఘర్షణపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం ఆ అంశాన్ని పెడచెవిన పెడుతూ వస్తున్నది.
దాంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష ఎంపీలు దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తవాంగ్ ఘటనపై పార్లమెంట్లో చర్చపెట్టాలని లేదంటే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేయబోతున్నదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తన రాజకీయ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తే దేశమంతా వారికి మద్దతు నిలుస్తుందని ఒవైసీ చెప్పారు. సరిహద్దుల్లో భారత సైన్యం బలంగా ఉన్నదని, కానీ వారికి మద్దతు నిలువడంలో ప్రభుత్వం మాత్రం బలహీనంగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. చైనా సేనలు భారత భూభాగంలోకి వచ్చినా.. ఎవరూ రాలేదంటూ ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు.
చైనా సైనికులు దెప్సాంగ్, దెమ్చోక్లను ఆక్రమించినట్లుగా శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయని ఒవైసీ చెప్పారు. చైనా వాళ్లు భారత భూభాగం ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని, భారత ప్రభుత్వం మాత్రం చైనాకు తగిన బుద్ధి చెప్పడంలో విఫలమవుతుందని, చైనాను చూసి మోదీ భయపడుతున్నాడని విమర్శించారు.