డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. పలు భవనాలు, ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో పాటు రోడ్లు కుంగుతుండటం పెను విపత్తుగా పరిణమిస్తోంది. భూమి భారీగా కోతకు గురవుతుండటం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దసంఖ్యలో భవనాలకు పగుళ్లు కనిపిస్తుండటంతో అధికార యంత్రాంగం ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు సన్నద్ధమైంది.
జోషిమఠ్లో భూమి కుంగిపోతుండటంతో 782 భవనాలు దెబ్బతిన్నాయి. వీటిలో 148 భవనాలు సురక్షితమైనవి కాదని అధికారులు గుర్తించారు. 223 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు జిల్లా అధికారులు తరలించారు. సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.
సహాయ చర్యలను సమన్వయం చేస్తూ సహాయ బృందాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం చేరవేసేందుకు జోషిమఠ్ ప్రాంతంలో ఆర్మీ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఆర్మీ నుంచి క్విక్ రెస్పాన్స్ టీం, రెస్క్యూ టీం, పికెటింగ్ పార్టీ, పర్వతారోహణలో నిపుణులతో కూడిన టీం, వైద్య బృందం రంగంలోకి దిగి సహాయ, పునరవావస కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.