శ్రీనగర్: ఆర్మీకి చెందిన హెలికాప్టర్ జమ్ముకశ్మీర్లో కూలింది. ఈ ఘటనలో పైలట్ మరణించగా, కో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవాధీన రేఖ సమీపంలోని ఉత్తర కశ్మీర్లోని బందిపొరా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. గురేజ్ సెక్టార్లో మంచుతో నిండిన బరౌమ్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చీతక్ హెలికాప్టర్ కూలిందని ఆర్మీ అధికారులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను తరలించేందుకు ఈ హెలికాప్టర్ వెళ్లిందని చెప్పారు. అయితే ముంచుపై ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి లోయలోకి జారి కూలిందని వివరించారు. పైలట్ మరణించగా, కో పైలట్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన కో పైలట్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
కాగా, ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ బృందాలను సంఘటనా ప్రాంతానికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. దట్టంగా మంచు అలముకోవడంతో నడుచుకుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బంది పైలట్, కో పైలట్ కోసం గాలించినట్లు చెప్పారు.