అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పీఓకేలో పర్యటించారు. ఆ తర్వాత పాకిస్తాన్లో కూడా పర్యటించారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్తో భేటీ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సంకుచిత స్వభావ రాజకీయాలకు ఇదో పెద్ద తార్కాణమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ దుయ్యబట్టారు.
”పాక్ అక్రమంగా ఆక్రమించుకొన్న, భారత్లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్లో అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పర్యటించారని మా దృష్టికి వచ్చింది. ఇలా సంకుచిత రాజకీయాలను అవలంబించాలని భావిస్తే.. అది వారి స్వభావమనే చెప్పాల్సి వుంటుంది” అంటూ అరిందమ్ బాగ్చీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ పర్యటనను తాము ఖండిస్తున్నామని బాగ్చీ స్పష్టం చేశారు.
ఇక.. ఆఫ్గనిస్తాన్లో జరిగిన ఉగ్రదాడులతో సహా.. అన్ని ఉగ్రదాడులను తాము ఖండిస్తూనే వస్తున్నామని అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే ఆఫ్గన్లో ఏం జరుగుతుందన్న విషయాలపై మాత్రం ఓ కన్నేశామని, ఎప్పటికప్పుడు వ్యవహారాలను చూస్తూనే వున్నామని ఆయన స్పష్టం చేశారు.