వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అసోం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో సాయుధ బలగాల చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాలను తగ్గిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టం కిందికి వచ్చే ప్రాంతాలను తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నాం అని అమిత్షా ట్వీట్ చేశారు.
ఈ మూడు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు. శాంతి కోసం, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిందని, అనేక ఒప్పందాలు కూడా చేసుకుందని, దీని కారణంగానే ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నాయని అమిత్షా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్షా మూడు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గత సంవత్సరం డిసెంబర్లో నాగాలాండ్లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అని భ్రమపడి ఆర్మీ సామాన్య పౌరులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 14 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేశారు.