హైదరాబాద్, ఫిబ్రవరి 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నీటిలో పడిన మొబైల్ ఫోన్ ను ఆరబెట్టడానికి కొందరు బియ్యం సంచిలో ఉంచడం చూసే ఉంటాం. అయితే, ఈ చర్యతో ఐఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదమున్నదని యూజర్లను యాపిల్ కంపెనీ తాజాగా హెచ్చరించింది. ‘నీటిలో పడిన ఐఫోన్ను ఆరబెట్టడంలో భాగంగా బియ్యం సంచిలో పెట్టడం వంటి పనులు చేయొద్దు. అలా చేయడం వల్ల బియ్యంలోని మైక్రో రేణువులు ఫోన్ను మరింతగా దెబ్బతీస్తాయి’ అని యాపిల్ పేర్కొంది.
ఫోన్ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్స్, కంప్రెస్డ్ ఎయిర్ డివైజ్లను కూడా వాడొద్దని తెలిపింది. ప్రమాదవశాత్తూ ఫోన్ నీటిలో పడిపోతే, ఆరబెట్టడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. తడిని తొలగించడానికి కనెక్టర్ కిందివైపు ఉండేలా ఫోన్ను ఉంచి నెమ్మదిగా చేతితో కొట్టాలని, తర్వాత ఫోన్ను పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచి.. 30 నిమిషాల తర్వాత మాత్రమే ఛార్జింగ్ పెట్టాలని సూచించింది. ఫోన్ తడిగా ఉన్నప్పుడు అత్యవసరంగా ఛార్జ్ చేయాల్సి వస్తే ‘లిక్విడ్ డిటెక్షన్’ను ఓవర్రైడ్ చేసే వెసులుబాటు ఉన్నట్టు గుర్తు చేసింది.