Apple users : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. భారత్ (India) లో మ్యాక్బుక్ (MacBook), ఐప్యాడ్ (IPad) ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా లక్ష రూపాయల వరకు ధర పెరగడం గమనార్హం. సవరించిన ఈ కొత్త ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (Artificial Intelligence) కోసం పెరుగుతున్న డిమాండ్తో మెమొరీ, స్టోరేజ్ చిప్ల ధరలు అమాంతం పెరిగాయి.
ఈ భారాన్ని ఇకపై భరించలేమని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కొద్దిరోజుల క్రితమే సంకేతాలిచ్చారు. తాజా పెంపుతో మ్యాక్బుక్ ప్రో 14-అంగుళాల (ఎం5 మాక్స్ వేరియంట్) ధరపై ఏకంగా రూ.1,00,000 పెరిగింది. బేస్ మ్యాక్బుక్ ప్రో 14 అంగుళాల మోడల్పై రూ.70,000, మ్యాక్బుక్ ఎయిర్ 13 అంగుళాలపై రూ.30,000, ఐప్యాడ్ ఎయిర్ 11 అంగుళాల మోడల్పై రూ.25,000 మేర ధరలు పెరిగాయి.
‘స్పేర్ పార్ట్స్ ధరలు ఇంత వేగంగా, ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పటివరకు వినియోగదారులపై భారం పడకుండా జాగ్రత్త వహించాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యమైంది’ అని యాపిల్ సంస్థ వెల్లడించింది. దిగుమతి సుంకాల కారణంగా ఇప్పటికే భారత్లో అధిక ధరలు చెల్లిస్తున్న వినియోగదారులకు ఈ పెంపు మరింత భారంగా మారనుంది. ముఖ్యంగా విద్యార్థులు, నిపుణులు, కొత్తగా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యాపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. మ్యాక్బుక్, ఐప్యాడ్లతోపాటు హోమ్పాడ్, యాపిల్ టీవీ ధరలను కూడా కంపెనీ సవరించింది.