న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్(iPhone Hacking) చేస్తున్నారని కొందరు విపక్ష ఎంపీలు ఇవాళ ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరికొంత మంది ఎంపీలు తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు ఎంపీలు చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. యాపిల్ సంస్థ సుమారు 150 దేశాల్లో వార్నింగ్ నోటీఫికేషన్లు జారీ చేసిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో సమగ్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మెసేజ్లు అందుకున్న వారితో పాటు యాపిల్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు.
#WATCH | On multiple opposition leaders allege ‘hacking’ of their Apple devices, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says “Whenever these compulsive critics do not have any major issue, the only thing they say is surveillance. They tried this a… pic.twitter.com/l8UhnoBD3Y
— ANI (@ANI) October 31, 2023
విమర్శకులకు ఎటువంటి ఇష్యూ లేని సమయంలో.. వాళ్లు కేవలం నిఘా గురించి మాట్లాడుతుంటారని, కొన్నేళ్ల క్రితం కూడా వాళ్లు ఇదే ప్రయత్నం చేశారని, గతంలోనూ విచారణ చేపట్టామని, న్యాయవ్యవస్థ సూపర్విజన్లోనే ఆ దర్యాప్తు సాగిందని మంత్రి తెలిపారు. ప్రియాంకా గాంధీ ఇద్దరు పిల్లల ఫోన్లు హ్యాక్ అయినట్లు అప్పట్లో చెప్పారని, కానీ నిజానికి అలా జరగలేదని మంత్రి వెల్లడించారు. కావాలని ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మంత్రి ఆరోపించారు.