న్యూఢిల్లీ, జనవరి 2: ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని యాప్ల ద్వారా వికృత చర్యలకు పాల్పడుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. మహిళల ఫొటోలు అప్లోడ్ చేసి.. అమ్మకానికి ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ‘బుల్లీ బాయ్’ అనే యాప్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ బుల్లీ బాయ్ యాప్ బాధితుల్లో ముస్లిం మతానికి చెందిన వందలాది మంది మహిళలు, విద్యార్థినులు, ప్రముఖులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇస్మాత్ ఆరా అనే జర్నలిస్టు, ప్రియాంక చతుర్వేది వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ, ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాప్లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్కు చెందిన ‘గిట్హబ్’ ప్లాట్ఫాం ఆధారంగా చేసుకొని రూపొందించారు. బుల్లీ బాయ్ను గిట్హబ్ బ్లాక్ చేసిందని కేంద్రమంత్రి అశ్విని వైష్టవ్ తెలిపారు. పోలీసులు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తదుపరి చర్యలను సమన్వయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఏంటీ బుల్లీ బాయ్?
గతేడాది జూలై 4న ‘బుల్లీ బాయ్’యాప్ను పోలిన వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ముస్లిం మహిళలను ట్రోల్ చేసేందుకు వినియోగించే అసభ్యకరమైన పదంతో కూడిన ఓ యాప్ను దుండుగులు సృష్టించారు. ఫొటోలు అప్లోడ్ చేసి ‘డీల్ ఆఫ్ ది డే’ అని ప్రకటన ఇచ్చేవారు. ఈ తరహాలోనే ‘బుల్లీ బాయ్’ యాప్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంలో యాక్టివ్గా ఉండే ముస్లిం మహిళలను ఎంచుకొని, వారి ఫొటోలను సేకరిస్తారు. యాప్ ఓపెన్ చేయగానే మహిళల ఫొటోలు కనిపించేలా సెట్టింగ్స్ను రూపొందించారు. వీరు అమ్మకానికి ఉన్నారంటూ ప్రకటన చేసి రాక్షస ఆనందం పొందుతారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
యాప్ల ద్వారా వికృత చర్యలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు డిమాండ్ చేశారు. మహిళలను అవమానించడంతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్న ఈ చర్యలను వ్యతిరేకించాలని, అప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. ముస్లింలను ఊచకొత కోయాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చినా లేదా ఆన్లైన్లో ముస్లిం మహిళలను టార్గెట్గా చేసుకున్నా కూడా నిందితులపై ఎటువంటి చర్యలు ఉండట్లేదన్నారు. అధికారంలో ఉన్న వారి అండతోనే క్రిమినల్స్ స్వేచ్ఛగా బయటతిరుగుతున్నారని ఆరోపించారు. బుల్లీ యాప్ వెనుక ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు పంజాబ్కు చెందిన ఎంపీ గుర్జీత్ సింగ్ లేఖ రాశారు.