న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లోగా తనకు జవాబివ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. విలేకరుల సమావేశానికి హాజరైన మనీష్ సిసోడియాకు ముఖం చెల్లలేదని, ఆయన ఏ ప్రశ్నకూ బదులివ్వలేదని అన్నారు.
మనీష్ సిసోడియాకు కేవలం మనీ వ్యామోహంతో డబ్బు తీసుకుని మౌనంగా ఉంటున్నాడని ఎద్దేవా చేశారు. మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మోదీ మధ్యే పోటీ ఉంటుందని సిసోడియా చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తప్పుపట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ విపక్షాల అభ్యర్ధిగా ముందుకొస్తే తమ పని మరింత సులువవుతుందని అన్నారు.
కేజ్రీవాల్ పేరు కూడా చాలా మంది వినలేదని, ఆయన విపక్షాల ప్రధాని అభ్యర్ధి అయితే తాము ఘన విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇక తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తనను ఎక్సైజ్ పాలసీ కేసులో ఇరికించారని మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.