న్యూఢిల్లీ: కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, ప్రస్తుతం నిలిపివేతలో(స్టే) ఉన్న యూజీసీ నిబంధనలను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి అజయ్ అలోక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అగ్రవర్ణాల ఆందోళనలను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో పరిష్కరించారని ఆయన పేర్కొన్నారు. యూజీసీ వివాదం, రిజర్వేషన్ల రద్దు ఆందోళనలు హిందూ ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. రోహిణి కమిషన్ అధ్యయనం చేసిన 2,598 వెనుకబడిన, అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందలేదని అజయ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు.