ముంబై, మార్చి 3: మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. చాణక్యుడు లేకుండా చంద్రగుప్తుడెక్కడ? సమర్థ రామదాసు లేకుండా ఛత్రపతి శివాజీ ఎక్కడ? అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆయన వ్యాఖ్యలు శివాజీని చిన్నబుచ్చేవిగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు గవర్నర్ రాగానే సభలో గలాటా మొదలైంది. పాలక మహా వికాస్ ఆఘాడీ సభ్యులు గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. బీజేపీ సభ్యులు కూడా అక్కడక్కడా గొంతు కలపాల్సి వచ్చింది. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. జాతీయ గీతాలాపన కోసం ఆగకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ను అవమానించినందుకు గవర్నర్ కోశ్యారీని వెనుకకు పిలవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్టు మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోళే మీడియాతో అన్నారు. ప్రభుత్వం గవర్నర్ను అవమానించిందని విపక్ష బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరోపించారు. ఈడీ అరెస్టు చేసిన మంత్రి నవాబ్ మాలిక్ను ఇంకా క్యాబినెట్ నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో గత డిసెంబర్లో శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించడం ఇష్టం లేకనే గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపేశారని ఎన్సీపీ నేత ఎమ్మెల్సీ అమోల్ మిత్కరీ ఆరోపించారు. గవర్నర్ ఆపేసిన ప్రసంగం భాగంలోనే ఆ ఖండన ఉందని అన్నారు.