న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో ఆరేండ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మూడింట రెండొంతుల మందిలో(దాదాపు 80 కోట్లు) కరోనా యాంటిబాడీలు ఉత్పత్తి అయినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇంకా 40 కోట్ల మందికి వైరస్ ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నది. యాంటీబాడీలు ఉన్న అందరికి వైరస్ సోకి ఉండొచ్చు లేదా టీకా వల్ల యాంటిబాడీలు ఉత్పత్తి అయి ఉండొచ్చు అని చెప్పింది. 6-17 ఏండ్ల మధ్య వయస్సున్న పిల్లల్లో సగం కంటే ఎక్కువ మందిలో కరోనా యాంటిబాడీలను గుర్తించినట్టు తెలిపింది. ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన నాలుగో సెరో సర్వే వివరాలను మంగళవారం వెల్లడించింది. జూన్-జూలై మధ్యలో 21 రాష్ర్టాల్లోని 70 జిల్లాల్లో 28,975 మంది సాధారణ పౌరులు/పిల్లలు, 7,252 మంది హెల్త్కేర్ వర్కర్లపై ఈ సర్వే నిర్వహించారు.
అందరిలో ఒకేరకంగా వ్యాప్తి
పిల్లల్లో కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ నిర్వహించిన మొట్టమొదటి సర్వే ఇదే కావడం గమనార్హం. గతంలో నిర్వహించిన మూడు సెరో సర్వేలనూ ఈ ప్రాంతాల్లోనే చేశారు. ‘ఆరేండ్ల వయసు దాటిన 67.6% మందిలో కరోనా యాంటిబాడీలు ఉన్నాయి. హెల్త్కేర్ వర్కర్లలో 85శాతం మందిలో యాంటిబాడీలు ఉత్పత్తి అయ్యాయి’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. హెల్త్కేర్ వర్కర్లలో పదోవంతు మంది ఇంకా టీకా వేసుకోలేదని చెప్పారు. గ్రామాలు/పట్టణాలు, పురుషులు/స్త్రీలు, పిల్లలు/పెద్దలు అన్న తేడా లేకుండా వైరస్ వ్యాప్తి అందరిలో దాదాపు ఒకే విధంగా ఉందని చెప్పారు. ఇంకా 40 కోట్ల మందికి వైరస్ ముప్పు పొంచి ఉన్నదని చెప్పారు.
ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదు: కేంద్రం
కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని, ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయినట్టు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు నివేదిక ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఈ మేరకు సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అయితే ఆక్సిజన్కు ఇంతముందు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. మొదటి వేవ్లో రోజుకు 3,905 టన్నుల డిమాండ్ ఉండగా సెకండ్ వేవ్లో 9వేల టన్నులకు పెరిగిందని తెలిపారు. మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతానన్నారు.
వైద్యురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు
డిబ్రూగఢ్, జూలై 20: అస్సాంలో ఓ మహిళా వైద్యురాలికి కరోనా వైరస్ రెండు వేరియంట్లు ఒకేసారి సోకాయి. ఇలాంటి కేసు భారత్లో ఇదే మొదటిదిగా భావిస్తున్నారు. ఆ వైద్యురాలు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా ఆల్ఫా, డెల్టా రకాల బారినపడ్డారు. ఇది మే నెలలో జరుగ్గా ఆమె దవాఖానలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారు.
వయస్సు యాంటిబాడీలు ఉన్నవారు
6-9 ఏండ్లు 57.2%
10-17ఏండ్లు 61.6%
18-44 ఏండ్లు 66.7%
45-60ఏండ్లు 77.6%
60 ఏండ్లకు పైగా 76.7%
పురుషులు 65.8%
మహిళలు 69.2%
గ్రామాలు 66.7%
పట్టణాలు 69.6%