కోటా: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు ట్రాన్స్పోర్ట్ నగర్లోని హాస్టల్ నుంచి కోచింగ్ సెంటర్కు బయల్దేరిన యువరాజ్ ఆచూకీ తర్వాత తెలియలేదు. అతను తన మొబైల్ ఫోన్ను హాస్టల్లోనే వదిలేశాడు. వారం రోజుల క్రితం రచిత్ సోంధ్య (16) అనే విద్యార్థి కూడా కోటా నుంచి అదృశ్యమయ్యాడు. రచిత్ జేఈఈ కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, ఇక్కడ శిక్షణ పొందుతున్నాడు. గత సోమవారం గరడియా మహదేవ్ దేవాలయానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ రచిత్ మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ యువకుడి ఆచూకీ కూడా ఇప్పటికీ తెలియలేదు.