న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కరోనా నేపథ్యంలో 2020, 2021లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్స్ బోర్డు (జేఏబీ) శుభవార్త అందించింది. 2022లో పరీక్ష రాసేందుకు వారికి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. వీరు మళ్లీ జేఈఈ మెయిన్-2022కు హాజరుకావాల్సిన అవసరం లేదని, నేరుగా అడ్వాన్స్డ్ హాజరవ్వొచ్చని తెలిపింది. ఇందుకు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని, ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది.
మూడో అటెంప్ట్కు నో
2020 బ్యాచ్ అభ్యర్థులకు సంబంధించి.. 2020, 2021లలో ఒక్కసారే పరీక్షకు హాజరైన వారు లేదా అసలు హాజరుకాని వారు ఈ జేఈఈ అడ్వాన్స్డ్-2022 అదనపు అవకాశానికి అర్హులని, ఆ రెండు సంవత్సరాల్లో పరీక్ష రాసిన వారు మూడో అటెంప్ట్కు అనర్హులని జేఏబీ స్పష్టం చేసింది. దీంతో 2022 జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిపై ఎటువంటి ప్రభావం చూపదని, ఎక్స్ట్రా అవకాశాన్ని వినియోగించుకునే విద్యార్థులను అదనపు సంఖ్యగా పరిగణిస్తామని పేర్కొన్నది. 2023 బ్యాచ్ నుంచి జేఈఈ సిలబస్లో మార్పు చేయబోతున్నట్టు జేఏబీ వెల్లడించింది.