తమిళనాడు : వర్గపోరుతో సతమతమవుతున్న ఏఐఏడీఎంకే(AIADMK) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న రాజీనామా చేసి సీఎం విజయ్ పార్టీ టీవీకేలో చేరగా తాజాగా మంగళవారం మరో ఎమ్మెల్యే రాజీనామా చేశాడు. అంబ సముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్కు అందజేశారు. సుబాయా కూడా టీవీకేలో చేరనున్నట్లు సమాచారం.
కాగా, ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (TVK) చేరిన విషయం తెలిసిందే. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు టీవీకేలో చేరారు.
ఈ ముగ్గురు నేతలు అన్నాడీఎంకేలోని మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి సన్నిహితులుగా పేరుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీకి కొన్ని స్థానాలు తగ్గడంతో కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వేలుమణి వర్గానికి చెందిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష సందర్బంగా తేలింది.