న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. సుఖు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని వారు ఆరోపించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వీరి చేరిక వల్ల బీజేపీ మరింత బలోపేతమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.కాగా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే ఈ పరిణామాల వల్ల హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో కష్టాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీలో చేరిన ఈ తొమ్మిది మంది గెలుస్తారని, మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించవచ్చునని, అనంతరం తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం మెజారిటీ మార్క్ 30 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్కు ప్రస్తుతం 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.