న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళపై మద్యం సేవించిన మరో వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. డిసెంబర్ 6న జరిగిన ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పారిస్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఒక వ్యక్తి మద్యం మత్తులో తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే ఆ వ్యక్తి ఏ క్లాస్లో ప్రయాణించాడో అన్నది తెలియలేదు. డిసెంబర్ 6న ఉదయం 9.40 గంటలకు ఆ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి విమాన సిబ్బంది మాట వినకపోగా మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేసిన విషయాన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి తెలిపారు. దీంతో ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిలువరించారు.
కాగా, ఆ వ్యక్తి రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేందుకు ఆ వ్యక్తిని అనుమతించారు. ఎయిర్ ఇండియా విమానాల్లో ఇలాంటి రెండు సంఘటనలు జరుగడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ నుంచి నివేదికలు కోరింది.