చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెంది 24 గంటలు గడువకముందే కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని బలవర్మణానికి పాల్పడింది. కేవలం రెండు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. తల్లి మందలించడంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు సమాచారం. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
తిరువళ్లూరులోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం ఆ సంస్థ హాస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య (ఉరి వేసుకుని) చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. సత్య ప్రియ విలేకరులతో వెల్లడించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్-సీఐడీ (సీబీసీఐడీ)కి బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ నెల 13 న కల్లకురిచి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. కాగా, టీనేజీ విద్యార్థుల మరణాలతో ఆందోళనకు గురైన తమిళనాడు ప్రభుత్వం ‘మనవర్ మనసు’ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు 800 మంది వైద్యులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి మాట్లాడుతూ.. కౌమారదశలో సమస్యలు, చదువుల ఒత్తిడి, తోటివారి ఒత్తిడి, పిల్లల ప్రవర్తనాపరమైన మార్పులకు సంబంధించిన ఇతర సమస్యల మధ్య విద్యార్థుల మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందన్నారు.