Cheetah | ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)లో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కు (Kuno National Park) లో తాజాగా మరో చీతా మరణించింది. శుక్రవారం ఉదయం ఆఫ్రికన్ చిరుత (African cheetah) సూరజ్ (Suraj) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చీతా మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల్లో ఇది రెండో మరణం కాగా, నాలుగు నెలల్లో ఎనిమిదో ఘటన కావడం గమనార్హం.
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా (Namibia) నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. రెండో దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా (South Africa) నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్కు తరలించారు.
అయితే, ఆ 20 చీతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది చీతాలు మరణించాయి. మార్చి 27వ తేదీన సాషా అనే ఆడ చీతా మూత్రపిండ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నెల తిరగకుండానే ఏప్రిల్ 23న కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్తో ఉదయ్ అనే చీతా మరణించింది. ఆ తర్వాత 20 రోజులకే మే 9న దక్ష అనే ఆడ చీత మృతి చెందింది. అదే నెలలో మూడు కూన పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఆ తర్వాత జులై 11వ తేదీన తేజస్ అనే మగ చీతా గాయాల కారణంగా మరణించింది. తాజాగా ఇప్పుడు సూరజ్ ప్రాణాలు కోల్పోయింది.
Also Read..
Delhi Rains | ఢిల్లీని ముంచెత్తిన వరద.. రంగంలోకి దిగిన సైన్యం
Heavy Rains | వరదలకు 145 మంది బలి.. అతలాకుతలమైన హిమాచల్
Upasana | మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. వీడియో షేర్ చేసిన ఉపాసన