Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పని ఒత్తిడిని తట్టుకోలేక మరో అధికారిణి ఆత్మహత్యకు పాల్పడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) స్పందించారు. ‘ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి..’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నదియా జిల్లా శాస్తితలాలోని కృష్ణనగర్లో ఎస్ఐఆర్ పని ఒత్తిడిని తట్టుకోలేక రింకు తరఫ్దార్ అనే మహిళా అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు రెండు పేజీల సూసైడ్ నోట్ కూడా రాశారు. గత బుధవారం కూడా ఇదే కారణంతో మరో మహిళా అధికారిణి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతాబెనర్జి స్పందించారు.
ఒక పద్ధతి అనేది లేకుండా రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం అధికారులపై పనిభారం పెంచుతోందని మమతాబెనర్జి మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రయత్నాన్ని మానుకోకపోతే మరింత మంది అధికారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.