న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాదిగా రైతులు నిరసన చేస్తున్న ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘులో మరో దాడి జరిగింది. దీంతో ఒక నిహాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ పాశ్వాన్ అనే వ్యక్తి రక్త గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ఒక నిహాంగ్ తనపై దాడి చేసినట్లు ఆయన ఆరోపించాడు. కోళ్ల వాహనం నడుతున్న తనను రైతుల నిరసన ప్రాంతంలో ఒక వ్యక్తి అడ్డుకున్నట్లు తెలిపాడు. కోడి ఇవ్వమని డిమాండ్ చేయగా తాను నిరాకరించానని అన్నాడు. లెక్క ప్రకారం కోళ్లను తీసుకెళ్లకపోతే తన ఉద్యోగం పోతుందని చెప్పానన్నాడు.
జేబులోని రసీదును తీసి చూపానని, ఈ సందర్భంగా బీడీ కనిపించడంతో ఆ వ్యక్తి ఆగ్రహంతో గొడ్డలి వంటి ఆయుధంతో తనపై దాడి చేశాడని మనోజ్ ఆరోపించాడు. సహాయం చేసేందుకు ప్రయత్నించిన తనపై కూడా అతడు దాడి చేసినట్లు మరో వ్యక్తి తెలిపాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు ఒక నిహాంగ్ను అరెస్ట్ చేశారు.
పవిత్ర సిక్కు మత గ్రంథాన్ని అవమానించాడన్న ఆరోపణతో నిహాంగ్ సిక్కులు కత్తులతో దళిత కూలీ లక్బీర్ సింగ్ చేతులు నరికారు. తీవ్ర రక్తస్రావంతో అతడు మరణించగా, రైతు నిరసన ప్రాంతమైన సింఘు వద్ద పోలీస్ బారికేడ్కు అతడి మృతదేహాన్ని వేలాడదీశారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిహాంగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.