చైన్నై: వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో తమ పార్టీ పొత్తును కొనసాగిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ అధిష్ఠానాన్ని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు. పార్టీ కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు వనతి శ్రీనివాసన్, ఎం చక్రవర్తి, వీపీ దురైస్వామిలతో పాటు రాష్ట్రస్థాయి నేతలు పలువురు హాజరైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ తాను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలంటే పొత్తును తెంచుకోవడమే ఉత్తమమని చెప్పారు.